రెండు లేదా మూడింతలు చేస్తాం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం
కరీంనగర్, ఆగస్టు 11(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ అర్హుల సంఖ్యను రెండు లేదా మూడింతలు పెంచుతామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. ఈ సంవత్సరానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ మార్చిలో పూర్తి చేయాల్సి ఉందని, ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగిందని తెలిపారు.
ఈ స్కాలర్షిప్ గతంలో 300 మందికి ఇచ్చేవారని, అర్హుల సంఖ్యను రెండింతలు లేదా మూడింతలు చే యాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపా రు. ఓవర్సీస్ స్కాలర్షిప్ అర్హుల ఎంపిక పూర్తయినప్పటికీ.. కొత్తవారితో కలిపి ఒకేసారి రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దన్నారు. గత ఏడాదికి సంబంధించిన రెండో దశ సాయం అందజేయడానికి ఆర్థికశాఖ అధికారులను సంప్రదించామని తెలిపారు. త్వరలోనే వాటి కోసం నిధులు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.