calender_icon.png 23 October, 2024 | 12:50 AM

మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తాం

04-05-2024 02:24:53 AM

టీ అమ్మి ప్రధానిగా ఎదిగిన ఘనత నరేంద్ర మోదీది..

రాహుల్‌గాంధీకి కుటుంబ వారసత్వం తప్ప ఏమీ లేదు..

మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను దూషించినా దీవెనలే..

బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్

కరీంనగర్ సిటీ, మే 3 (విజయ క్రాంతి): ప్రధాని మోదీ మహిళల పక్షపాతి అని, వారి కోసం 33శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధాని చొరవతో అతి త్వరలో మహిళల చేతికి అధికార పగ్గాలు రాబోతున్నాయన్నారు. కరీంనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన భారతీయ జనతా మహిళా మోర్చా మహిళ శక్తి సమ్మేళనంలో ఆయన మాట్లాడా రు. బీఆర్‌ఎస్ ప్రభుత్వమంటే ప్రజలకు గుర్తేచ్చేది మద్యం, అత్యాచారాలు, హత్యలు మాత్ర మేనని విమర్శించారు. ఆ ప్రభుత్వాన్ని మించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతున్నదన్నారు.

ప్రధాని మోదీకి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి కొందరు పోలి కలు చూస్తున్నారని, వారిద్దరికీ ఏమాత్రం పోలికలు లేవన్నారు. టీ అమ్మి ప్రధానిగా ఎదిగిన వ్యక్తి మోదీ అని, ఇందిరాగాంధీ మనుమ డిగా, రాజీవ్‌గాంధీ కుమారుడిగా తప్ప ఆయనకు ప్రత్యేకమైన గుర్తుంపు ఏమీ లేదన్నారు. తాత, తండ్రి పేరు చెప్పుకొని రాహుల్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీలో అసలు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదని, అలాంటి పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశా రు. మోదీ దేశ ప్రజలే తన కుటుంబమని రేయింబవళ్లు శ్రమిస్తున్నారని కొనియాడారు. చిన్నప్పుడు తన తల్లి కట్టెల పొయ్యిపై అన్నం వండుతూ ఇబ్బంది పడిన తీరు తనకింకా గుర్తున్నదన్నారు.

అలాంటి బాధలు మహిళలకు ఉండొద్దనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఉజ్వల పథకం కింద మోదీ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీ సొంతమన్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించారని కొనియాడారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేం దుకు బీజేపీ పనిచేస్తున్నదన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  వెలిచాల రాజేందర్ ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చు పెట్టి, గెలిచాక దోచుకోవడానికి సిద్ధమవుతున్నారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ హయాంలో తాను నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉద్యమిస్తేంటే, తనపై పేపర్ లీక్ అభియోగాలు మోపారన్నారు. ఆ కేసులో తాను అరెస్టు అయి వరంగల్‌కు వెళ్లానని గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనను ‘వెధవా..’ అని దూషించారని, కానీ తాను దూషణను సైతం దీవెనగా తీసుకున్నానని తేల్చిచెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ ముఖ్యనేతలు గంగాడి కృష్ణారెడ్డి, ముగా జయశ్రీ, డాక్టర్ శిల్ప, నళిని, చొప్పరి జయశ్రీ, సుధ, పద్మ పాల్గొన్నారు. 

బీజేపీలో చేరికలు

చొప్పదండి, మే 3: గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి, గట్టు బూత్కూ ర్, గర్షకుర్తి గ్రామాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో సహా సుమారు 300 మంది శుక్రవారం కరీంనగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి బండి సంజయ్ కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గట్టుబూత్కూర్ మాజీ ఉప సర్పంచ్ కాసారపు శైలజ, కాచిరెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ బచ్చు లక్ష్మయ్య, నాయకులు బచ్చు రమణ, కోల శ్రీనివాస్, చల్లూరు శివ, మధు, భూమయ్య, పెద్ది అనిల్, పుల్ల పద్మ, జమున, రమేష్, పవన్‌రెడ్డి, నరసయ్య ఉన్నారు.