07-03-2025 01:37:58 AM
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని, బీఆర్ఎస్ క్యాడర్ అంతా బీజేపీకి సపోర్ట్ చేసిందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఆ రెండుపార్టీలు కలిసి ఓడించాయని చెప్పారు.
ఎమ్మె ల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్బాబు కౌంట ర్ ఇచ్చారు. గురువారం గాంధీభవన్లో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, పీసీసీ అధికార ప్రతిని ధి కొనగాల మహేశ్ తదితరులతో కలిసి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. ‘మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చాం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చాయా..? త్వరలో మరో పండ గ వస్తుంది.
అప్పుడు మేము బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచిందా..?’ అని మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు. తనకు పార్టీ మద్దతు ఉందని బీఆర్ఎస్ నేత రవీందర్సింగ్ ప్రచారం చేశారని, పరోక్షంగా రవీందర్ సింగ్ను బీఆర్ఎస్ బలపరిస్తే ఆ పార్టీ శక్తి అం తేనా..? అని ఎద్దేవా చేశారు. రవీందర్సింగ్కు వచ్చిన ఓట్లు ఆయన వ్యక్తిగతమంటున్న బీఆర్ఎస్ నాయకులు.. మీ పార్టీ ఓట్లు ఎవరికి పడ్డా యో చెప్పాలన్నారు.
బలహీనవర్గాలపై నిజంగా బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే బీసీ అభ్యర్థిని ఎందుకు పోటీకి దింపలేదని ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటమిపై సమీక్షించుకుంటామని, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సవరించుకుంటామని, కాంగ్రెస్పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందువల్లే మా అభ్యర్థికి అన్ని ఓట్లు వచ్చాయని చెప్పారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అనే మాట తాము ఎక్కడా చెప్పలేదని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. బీజేపీ గెలుపు అనైతికమని, చెల్లని ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని, ఇది దురదృష్టకరమన్నారు.
ఆ పార్టీల పతనానికి మొదటి అడుగు
బీజేపీ, బీఆర్ఎస్ కలవడమనేదే వాళ్ల పార్టీల పతనానికి మొదటి అడుగు అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ రెండు పార్టీల మధ్య బంధాన్ని పదిలపర్చుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా శ్రమించారని ఎద్దేవా వేశారు.
తమకు ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమైతే మిగతా పనులను పక్కనపెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకే వెళ్లేవాళ్లమని, కానీ కులగణన ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టే ఆలస్యమైందని తెలిపారు. పట్టభద్రులతో పాటు రాష్ర్టంలోని యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న దన్నారు. పట్టభద్రులకు నైపుణ్యాన్ని పెంచాలని సీఎం దిశానిర్దేశం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.