calender_icon.png 26 February, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోగస్‌లను ఏరివేస్తాం

20-02-2025 01:04:38 AM

* బీఆర్‌ఎస్ నేతల తప్పులు బయటపెడతాం

* కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రూ.42 కోట్లు ఖాతాల్లో పడ్డాయి

* తాజాగా మరో రూ.71 కోట్లు కలెక్టర్ ఖాతాలోకి వచ్చాయి

* జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల, ఫిబ్రవరి 19: నిజమైన నిర్వాసితులకు ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగ కుండా ఉదండాపూర్లో రిసర్వ్ చేయించి బోగస్ లబ్దిదారులను ఏరివేసి  న్యాయం చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతా ల్లో సర్వే పూర్తి కాగా ఉదండాపూర్ లో సర్వే జరిగితే తమ దొంగతనం బయటపడుతుందని బీఆర్‌ఎస్ నాయకులే సర్వే జరగనివ్వ కుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

జడ్చర్లలో బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించిన అనంతరం తనను కలిసిన కొందరు మీడియా ప్రతినిధులతో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, ఉదండాపూర్ లో నివాసం ఉన్నట్లుగా గతంలో 1005 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అయితే వాస్తవానికి అందులో 570 మంది మాత్రమే ఉదండాపూర్‌లో నివాసం ఉంటు న్న నిర్వాసితులు కాగా మిగిలిన వారందరూ బీఆర్‌ఎస్ నేతలు చేర్చిన బోగస్ లబ్దిదారులని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అసలైన లబ్దిదారులతో పాటుగా బోగస్ లబ్దిదారులకు కూడా ప్రభుత్వం నుంచి ఇళ్లు పరిహారాలు ఇప్పించాలని బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి పాచిక పారలేదన్నారు. ప్రస్తుతం వల్లూరు గ్రామంలోనూ, ఇతర తాండాల్లోనూ సర్వే పనులు పూర్తి కాగా ఉదండాపూర్ లో మాత్రం సర్వే జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. సర్వే చేస్తే ఎవరికి ఇళ్లు రావాలో, ఎవరికి స్ట్రక్చర్ పైసలు రావాలో వారికి వస్తాయన్నారు.

ఉదండాపూర్ లో సర్వే జరిగితే తమ దొంగతనం బయటపడుతుందనే భయంతోనే బీఆర్‌ఎస్ నేతలు సర్వే జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారని అనిరుధ్ రెడ్డి దుయ్యబట్టారు. అయితే ఉదండాపూర్‌లో సర్వే జరిపి తీరుతామని, అక్కడున్న బోగస్ లబ్దిదారులను ఏరివేసి నిజమైన నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేసారు. 

బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో జరిగిన నిర్లక్ష్యం కారణంగానే ఉదండాపూర్ సమస్య పరిష్కారం కాకుండా మిగిలిపోయిందన్నారు. తమ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.42 కోట్ల రుపాయలు తాండాలకు చెందిన నిర్వాసితుల ఖాతాల్లోకి జమ కావడం జరిగిందని గుర్తు చేసారు. ఇది కాకుండా రెండు రోజుల క్రితమే  దీనికి సంబంధించి మరో రూ.71 కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వచ్చాయని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.

దీంతో ఆ తాండాల వారందరికీ ప్లాట్ల కేటాయింపులు పూర్తి కావడంతో పాటుగా స్ట్రక్చర్ పైసలు కూడా వారి అక్కౌంట్లలోకి రావడం జరుగుతుందని వివ రించారు. వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలకు అవార్డు పాసైతే ఆరు నెలల లోపుగా వారికి రావాల్సిన నిధులన్నీ తాను తీసుకువస్తానని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు పరిహారం పెంపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈ సమస్య వెళ్లిందన్నారు. తాను అధికార పక్షానికి చెందిన శాసన సభ్యుడైనప్పటికీ ఎప్పుడు కూడా నిర్వాసితుల పక్షమే ఉంటానని అనిరుధ్ రెడ్డి  మరో మారు తెలిపారు.