12-02-2025 12:25:49 AM
ఎల్బీనగర్, ఫిబ్రవరి 11 : జీహెచ్ఎంసీ కార్మికులు చేస్తున్న సేవలవను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా గుర్తిస్తుందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ, టీజేఏసీ, జీహెచ్ఎంసీ కార్మిక యూనియన్ నాయకులతో కలిసి ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకుంటామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్, కోదండరాం అన్నారు. మంగళవారం సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి టీజేఏసీ (తెలంగాణ జన సమితి) సంపూర్ణ మద్దతు తెలిపింది.
ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డి, నాయకులు జనక్ ప్రసాద్, సత్యజిత్ రెడ్డి, ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆదిల్ షరీఫ్ తదితరులతో కలిసి కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల నాయకులు పలు సమస్యలను కోదండరాం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ..... గతంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాలకులను కలిసే పరిస్థితి లేదన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కార్మిక పక్షపాతిగానే వ్యవహరిస్తుందన్నారు. గ్రేట్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసి కార్మికులు చేస్తున్నటువంటి విధి నిర్వహణ ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందన్నారు. ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భీమా, జిహెచ్ఎంసి చెత్త రవాణా రంగం ప్రైవేటీకరణ తదితర అంశాల పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, ఎం.శివరాజ్, ఆర్ మహేష్, సిహెచ్ నర్సింహ, చరణ్ సింగ్, యాదగిరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.