11-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆప్ క్యూఆర్ కోడ్ పోస్టర్ విడుదల చేసారు.
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కాకపోయినా ఎవరైనా సామాన్యులు పారదర్శకత, జవాబుదారీతనం ఉన్న వారు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి పోటీ చేయడానికి ఆప్ క్యూఆర్ కోడ్ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.
రైతులు, మహిళలు, యువత తో సహా సమాజంలోని ప్రతి వర్గానికి మంచి విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధికి హామీ ఇస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించే ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలకు జరిగే అన్ని ఎన్నికలలో పోటీ చేయాలని ఆప్ జాతీయ నాయకత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని జిల్లాలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటాలు నిర్వహి స్తుందని, ’కామన్ మ్యాన్’ పార్టీ గా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలలో ఆప్ మొదటిసారిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, రాబోయే ఎన్నికలలో దీనిని పరీక్షిస్తామని. ప్రజలకు ఆప్ ఏమిటో చూపించడానికి, ప్రదర్శించడానికి ఒక అవకాశం అడుగుతామని డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు.
ఆప్ నేతలు జావీద్ షరీఫ్, నర్సింగ్ యమునా గౌడ్, డా. లక్ష్య నాయుడు, సుధారాణి, షాబాజ్, లియాఖత్ ఖాన్, లతా, మౌనిక, ధర్మేందర్ తివారి, స్వామి, సురేష్, జూలకంటి నాగరాజ్, విజయ్ ముల్లంగి తదితరులు పాల్గొన్నారు.