17-04-2025 12:31:02 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి,ఏప్రిల్16(విజయక్రాంతి): ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేసిపల్లి సత్యం అన్నారు. బుధవారం గంగాధర మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ యేసంగి సీజన్ లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ముందస్తుగానే ప్రణాళిక చేసి సాగు నీటిని విడుదల చేసి గుంట భూమి కూడా ఎండిపోకుండా సాగునీరు అందించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేసంగి సీజన్లో భూమికి బరు వైనన్ని వడ్లు వచ్చాయన్నారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావొద్దని కొనుగోలు కేంద్రాలకు రైతును తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,రామిడి రాజిరెడ్డి,సత్తు కనుకయ్య ,రోమల రమేష్, దోమకొండ మహేష్, దోర్నాల శ్రీనివాసరెడ్డి,రాజ గోపాల్ రెడ్డి ,కర్ర బాపు రెడ్డి, తోట సంధ్య ,రెండ్ల శ్రీనివాస్, తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.