08-04-2025 12:56:53 AM
ఎంజీయూ ప్రైవేట్ కళాశాల సంఘం ఆర్థిక కార్యదర్శి ప్రవీణ్కుమార్
నల్లగొండ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : రాష్ట ప్రభుత్వం కళాశాలల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలని ఎంజీయూ ప్రైవేట్ కళాశాల సంఘం ఆర్థిక కార్యదర్శి, శ్రీసాయికృపా డిగ్రీ, పీజీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
సోమవారం నుంచి ఈ నెల 9 వరకు జరగాల్సిన గ్రూప్- బీ ప్రాక్టికల్ పరీక్షలను సైతం బహిష్కరించినట్లు వెల్లడించారు. మూడేండ్లగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడంతో యాజమాన్యాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లెక్చరర్ల వేతనాలు చెల్లించేందుకు కళాశాలల యాజమాన్యాలు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.
సర్కారు తీరును నిరసిస్తూ ఈ నెల 2 నుంచి ఎంజీయూ పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో జరగాల్సిన గ్రూప్- ఏ ప్రాక్టికల్ పరీక్షలు బహిష్కరించినా ప్రభుత్వం స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా స్పందించకుంటే ఈ నెల 11 నుంచి జరగనున్న థియరీ పరీక్షలనూ బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. పరీక్షలు సజావుగా సాగేలా ప్రభుత్వం సహకరించాలని ప్రవీణ్కుమార్ విజ్ఞప్తి చేశారు.