- రైతుల హెచ్చరిక, ఆందోళనలు
- రుణమాఫీ చేయాలని డిమాండ్
కామారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి)/నకిరేకల్: ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు రూ.2లక్షల లోపు పంట రుణాలు వెంటనే మాఫీ చేయాలని, లేదంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా గాంధారిలో కామారెడ్డి రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం రామన్నపేట పట్టణంలో రైతులు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రుణమాఫీ చేసి, రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గాంధారిలో రైతుల ధర్నాకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రామన్నపేటలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మద్దతు తెలిపారు. అబద్ధపు, మోసపూరిత హామీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.