calender_icon.png 1 October, 2024 | 7:19 AM

రుణమాఫీ కోసం ప్రభుత్వ మెడలు వంచుతాం

10-09-2024 04:11:28 AM

 మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వం మెడలు వంచి రైతులకు రుణమాఫీ చేయిస్తామని మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని, సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం ఆయన జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 30లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. ఏ గ్రామంలో కూడా 30 నుంచి 40 శాతానికి మించి రుణమాఫీ కాలేదన్నారు.

ఎన్నో సాకులు చూపి రుణమాఫీ ఎగ్గొట్టారని విమర్శించారు. దీంతో కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వంద శాతం రుణమాఫీ అయ్యే వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. త్వరలో అన్ని కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో రూ.వంద కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆగిపోయాయయని ఆరోపించారు. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు.