టీఆర్టీఎఫ్ టీచర్ సంఘం ప్రకటన
హైదరాబాద్, ఫిబ్రవరి 01 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపును ప్రకటించడంపట్ల టీఆర్టీఎఫ్ టీచర్ సంఘం అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అయితే పాత రిజీమ్లో ఎలాంటి పెంపుదల లేకపోవడం సరికాదని పేర్కొన్నారు.
దీనివల్ల గృహ నిర్మాణ రంగం, హెల్త్ ఇన్సూరెన్స్, జిపిఎఫ్లో పొదుపు, ఉన్నత విద్యా రుణాలను నిరుత్సాహపరుస్తుందని అభిప్రాయపడ్డారు. రూ. 12 లక్షల ఆదాయం గల వారికి రూ. 4 లక్షల నుండే తిరిగి పన్నును ప్రభుత్వం రాబడుతుందని, దీన్ని కనీసం రూ.5 లక్షలకు పెంచాలన్నారు.
అలాగే స్టాం డర్డ్ డిడక్షన్ను రూ.2 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగం, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగుల పొదుపునకు సంబంధించి దేశ ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సహేతుకమైన సవరణలు చేయాలని కోరారు.