ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్, అక్టోబర్ 4(విజయక్రాంతి): హైడ్రా కూల్చివేతలతో మూడు నెలల నుంచి హైదరాబాద్ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లతో అఖిలపక్ష సమావేశం పెడుతామని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
ఈ సమావేశం ముందే నిర్వహించే ఉంటే బుచ్చ మ్మ చనిపోయేది కాదన్నారు. నల్లచెరువులో బీఆర్ఎస్ నేతల ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎవరు ఆక్రమణలకు పాల్పడ్డారో సీఎం నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు.
కూకట్పల్లిలోని కాజాకుంటలో ఇద్దరు జడ్జిలకు ఏ పార్టీ నేతలు భూములు అమ్మారో సీఎం విచారణ చేయించాలని, ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలను కబ్జాదారులు అనడం సరికాదన్నారు. మూసీ పరివాహక ప్రజలను ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించాలని, ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.