- డబుల్ బెడ్ రూం ఇండ్లు వద్దు
- కలెక్టరేట్ ఎదుట మూసీ నిర్వాసితుల ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ‘మా ఇండ్లు మాకే కావాలి.. డబుల్ బెడ్ రూం ఇండ్లు వద్దు’ అని మూసీ నిర్వాసితులు గొంతెత్తారు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం మూసీ నిర్వాసి తుల సంఘం ఆధ్వర్యంలో అంబర్పేట గోల్నాక తులసీనగర్ వాసులు ఆందోళన చేశారు. ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారికి వినతిపత్రం అందజేశారు.
వారికి సీపీఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూసీ సుం దరీకరణ పేరిట పేదల ఇండ్లు కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గోల్నాక ప్రాంతంలో 70 ఏళ్లుగా పేదలు నివాసముంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు లేనివాళ్లకు ఇండ్లు ఇవ్వాలని, ఉన్న ఇండ్లను కూల్చొద్దని సూచించారు.
ప్రభుత్వ చర్యల ద్వారా నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని డబుల్ బెడ్రూంలకు వెళితే తాము ఆర్థికంగా నష్టపోవ డంతోపాటు జీవనోపాధిని కోల్పోతామని నిర్వాసితులు వాపోయారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, తమ ఇళ్లను తొలగించకుండా మూసీని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.