16-04-2025 12:00:00 AM
తెలుగమ్మాయి సుమయరెడ్డి హీరోయిన్గా నటిస్తూ నిర్మాతగా, రచయితగా వ్యవహరించిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయిరాజేశ్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించిన ఈ సినిమాలో పృథ్వీ అంబర్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో సుమయరెడ్డి మీడియాతో సమావేశమై, చిత్ర విశేషాలను పంచుకున్నారు. “మాది అనంతపూర్. మోడలింగ్ రంగం నుంచి ఇటొచ్చాను.
కరోనా టైమ్లో నాకు రోజూ ఓ కల వస్తూ ఉండేది. ఆ కలలో వచ్చిన పాయింట్ మీదే ఈ సినిమా కథ రాసుకున్నా. తెలుగు హీరోను తీసుకోవాలని ప్రయత్నించాం. కుదరలేదు. అయితే, పృథ్వీ అంబర్కు కథ చెప్పాం. కొత్త ప్రొడక్షన్ అని కూడా చూడకుండా వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమాలో కార్పొరేట్ హాస్పిటళ్లలో డాక్టర్లు, పేషెంట్స్కి మధ్య వారధిగా ఉండే వ్యక్తుల స్వార్థబుద్ధి కారణంగా ఏం జరుగుతుందో చూపిస్తాం.
సోషల్ మెస్సేజ్లా కాకుండా ఓ సొల్యూషన్ను చెబుతాం. అందరికీ అవగాహన కల్పించేలా ఉంటుందీ చిత్రం. ఆర్టిస్టులు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్.. అందర్నీ గుర్తింపు ఉన్నవాళ్లనే తీసుకున్నాం. అలా ముందుకు వెళ్లున్నకొద్దీ బడ్జెట్ పెరుగుతూనే వచ్చింది. ఒక్కోసారి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నామో కూడా అర్థంకాదు. నటించడం చాలా సులభం. నిర్మాతగా ఉండటం చాలా కష్టం” అని చెప్పారు.