25-04-2025 05:35:23 PM
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ...
కామారెడ్డి (విజయక్రాంతి): ముస్లిం మత పెద్దలతో హైదరాబాదులోని షబ్బీర్ అలీ నివాసంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముక్త కంఠంతో అందరూ ఈ దాడిని ఖండిస్తూ ఈరోజు శుక్రవారం రోజున చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... జమ్మూ కాశ్మీర్ పహాల్గామ్ లోని పర్యటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకొని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ.. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా కఠినాతి కఠినంగా శిక్షించాలని కలలో కూడా ఇలాంటి చర్యలు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్ష అమలు చేయాలన్నారు. కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదానికి మతం ఉండదని చిన్న చీమకు కూడా హాని తలపెట్ట వద్దని ఇస్లాం చెప్తుంది అన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్య అయినా సరే మా మద్దతు ఉంటుంది. మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే ఈ హేయమైన చర్యను ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు.