21-03-2025 01:51:13 AM
ఆదర్శ పాఠశాలలో నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారభించిన జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్, మార్చ్ 20 (విజయ క్రాంతి) : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, వాటిని సాధించి సమాజానికి సేవ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జైనథ్ ఆదర్శ పాఠశాలలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాల మేరకు పట్టుదలతో కృషి చేసి వాటిని సాధించాలని తెలిపారు. పది సంవత్సరాల నిడివి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని, కానీ ఎట్టి పరిస్థితుల్లో మానసికంగా ఒత్తిడికి గురి కావద్దని చెప్పారు.
ఉపాధ్యాయులు ఓ జట్టు స్ఫూర్తితో పనిచేసి, విషయాలను వివరిస్తూ వారిలో జిజ్ఞాసను నెలకొల్పాలని సూచించారు. జిల్లా విద్యాధికారి ప్రణీత, తహసిల్దార్ నారాయణ, ఎంపీడీవో రవీంద్రనాథ్, ఆరోగ్య పాఠశాల జిల్లా సమన్వయకర్త అజయ్, ప్రిన్సిపల్ రాము, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.