24-04-2025 04:23:15 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): 139వ మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాడుదాం ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్(IFTU District General Secretary Tallapalli Srinivas) అన్నారు. గురువారం బెల్లంపల్లి సింగరేణి సివిక్ విభాగం కార్యాలయ ఆవరణలో 139 మే డే పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 139వ "మే డే" స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాడుదామని కార్మిక లోకానికి పిలుపు ఇచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని ఆయన అన్నారు.
మోడీ ప్రభుత్వం కార్పోరేట్ అధిపతులు అంబానీ, ఆదానీ లకు ప్రజాసంపదను కట్టబెట్టెందుకే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిoదన్నారు. తద్వారా కార్మిక వర్గానికి మరణశాసనం విధించారని ఆయన అన్నారు. అన్నదాత రైతన్న అంటూ భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కిస్తున్న నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలను నిరసించాలన్నారు .కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను, అన్యాయాన్ని ప్రశ్నిస్తే, కార్మికుల్ని, నిర్బంధిస్తుందని విమర్శించారు. కేంద్ర సర్కార్ ఫాసిస్ట్ పాలనను కొనసాగిస్తూ, ఎమర్జెన్సీని మరిపిస్తోందని ఆయన మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేయడం ఆపి, రక్షించాలని, ఆయన డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఐక్యతను విచ్చిన్నం చేస్తూ, లౌకిక విలువలను పాతరేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలన్నారు. దేశంలోని కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని కోరారు. స్వచ్ భారత్ లో అగ్ర భాగాన ఉన్న గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధి కేటాయించి, ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు.
బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని లేదా కేంద్ర ప్రభుత్వం జీవన భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చికాగో అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో గ్రామ గ్రామానా మేడే సభలు నిర్వహించి, కార్మిక ఉద్యమానికి సమరశంఖం పూరించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఎస్ సీ సీ డబ్ల్యూ యూ, ఐఎఫ్టియు -రీజియన్ నాయకులు న్. కృష్ణవేణి, జి వెంకటి, బి లింగన్న, శ్రీనివాస్, భాను, కొమరన్న, పద్మ, కరుణ, సునీత, పోసక్క, చంద్రకళ, అమృత, లక్ష్మి, కమల, వెంకటేష్, గణేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.