15-04-2025 12:00:00 AM
సూర్యాపేట, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) ః జార్జి రెడ్డి స్పూర్తితో శాస్త్రీయ విద్య, సమానత్వ సమాజ స్థాపనకై పోరాడుదామని పీడీఎస్యు రాష్ర్ట ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార, ఇండియన్ చేగువేర, పిడిఎస్యు వ్యవస్థాపకులు జార్జి రెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో ప్రగతశీల ప్రజాస్వామ్య విద్యార్ధుల ఐక్యత(పిడిఎస్యు) మరియు ప్రజా సంఘాల అధ్వర్యంలో జార్జి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అందించాల్సిన విద్యను కార్పొరేట్,ప్రైవేట్ శక్తులకు ప్రభుత్వ విద్యను అప్పనంగా అప్పజెప్పి పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మిగిల్చారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యను మొత్తం కూడా కాషాయకరణ చేసేందుకే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని వచ్చింది అన్నారు.
శాస్త్రీయమైన ఆలోచనలు విద్యార్థులకు రేకెత్తించకుండా పురాణాల పేరుతో విద్యార్థుల మెదలల్లో మూఢవిశ్వాసాలతో నింపేందుకు తీవ్రమైన కృషి చేస్తున్నది అన్నారు. కామ్రేడ్ జార్జి రెడ్డి శాస్త్రీయమైన విద్య విధానం కావాలని పేదోడికైనా పెద్దోడికైనా ఒకే రకమైన విద్య ఉండాలని ఆశించాడు అన్నారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు సూరం విజయ్, వంటికొమ్ము నగేష్ రెడ్డి,బీమనపెల్లి ప్రకాష్, భవాని,రేణుక, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారాసాని చంద్రకళ, కోశాధికారి జయమ్మ, సహాయ కార్యదర్శి సంతోషి మాతా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, టియుసీఐ జిల్లా నాయకులు సయ్యద్, గులాం హుస్సేన్,లక్ష్మీ,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.