కమ్మర, వడ్రంగి కులవృత్తుల సమస్యలు పరిష్కరించాలి
ఇందిరాపార్కులో విశ్వబ్రాహ్మణుల మహాధర్నా
పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జూలై 21: కమ్మర, వడ్రం గి కులవృత్తిదారుల సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని, అప్పుడే విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణిస్తారని పలువురు వక్త లు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, జస్టిస్ చంద్రకుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్లు హాజరై మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రపంచీకరణ, యాంత్రీకరణ కారణంగా కమ్మర, వడ్రంగి, కంసాలి కులాల వారు మొట్టమొదటగా ఉపాధిని కోల్పోయారని, ఈ కులాలపై కార్పొరేట్ కంపెనీల ప్రభావం తీవ్రంగా పడిందన్నారు. ఈ వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కుమ్మరి, వడ్రంగి చేతి వృత్తిదారులు వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచారని, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆదరణ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లో కుమ్మరి, వడ్రంగి చేతి వృత్తిదారులకు చేయూతనిచ్చే విధంగా అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మధుసూదనాచారి మాట్లాడుతూ.. విశ్వకర్మ సం ఘాలన్నీ ఐకమత్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కమ్మ రి, వడ్రంగి చేతి వృత్తిదారులకు టెక్నాలజీతో కూడిన పనిముట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి, రాళ్లబండి విష్ణు చారి, తాటికొండ శ్రీరాములు చారి, తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వేములవాడ మధన్మోహన్ చారి, బీసీ ఐక్య వేదిక కులాల చైర్మన్ కుందారపు గణేషా చారి, లింగోజిగూడ కార్పొరేట ర్ డీ రాజేష్ రెడ్డి, మారోజు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.