15-04-2025 01:05:55 AM
కె.యు రిటైర్డ్ ప్రొఫెసర్ సి.హెచ్. దినేష్ కుమార్
హనుమకొండ, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): పి.డి.ఎస్.యు. వ్యవస్థాపకులు, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నేత, ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జి రెడ్డి స్పూర్తితో కుల, మత, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వ సమాజాన్ని స్థాపించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సి.హెచ్. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కామ్రేడ్ జార్జి రెడ్డి 53 వర్ధంతిని స్మరించుకుంటూ పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో విద్యార్థులు, జార్జిరెడ్డి అభిమానులు, ప్రజాస్వామికవాదులు,పి.డి.ఎస్.యు. పూర్వ విద్యార్థులంతా కలిసి మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ దినేష్ కుమార్ కేయూ మొదటి గేటు వద్ద జెండా ఊపి ప్రారంభించగా పి.డి.ఎస్.యు.శ్రేణులు,విద్యార్థులంతా జార్జిరెడ్డికి లాల్ సలాం, జీనా హై తో మర్నాసికో, కదం కదం పర్ లడ్ నా సికో, విద్య కాషాయీకరణ, ప్రైవేట్, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం, శాస్త్రీయ విద్యను సాధిద్దాం, దేశంలో మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటిద్దామంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కె.యు.రెండవ గేటు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
పి.డి.ఎస్.యు. పూర్వ విద్యార్థులు ఆస్నాల శ్రీనివాస్, హన్మకొండ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తీగల జీవన్ , నున్న అప్పారావు, ముల్క రవి, పి.డి.ఎస్.యు. రాష్ట్రనేతలు మొగిలి వెంకట్ రెడ్డి, బి.నరసింహరావు, ఇ.విజయ్ ఖన్నా లు ప్రసంగించారు. నేటి విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని కోరారు. బిజెపి మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో పెరిగిపోతున్న మతోన్మాద ఫాసిజన్ని అడ్డుకోవాలంటే, ప్రగతిశీల ఉద్యమాలను, భావజాలాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కామ్రేడ్ జార్జి రెడ్డి భౌతికంగా దూరమై 53 ఏళ్లు గడిచినప్పటికీ నేడు వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్న పోరాటాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో నిత్యం స్ఫూర్తిదాయకంగా వెలుగొందుతున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. పూర్వ విద్యార్థులు సూత్రపు అనిల్, రూపేష్, మైదం పాణిలతో పాటు పి.డి.ఎస్.యు.నేతలు మిశ్రీన్ సుల్తానా, రాచకొండ రంజిత్, వినయ్, బి.బాలు, వి.కావ్య, వంశీ, అనూష, అర్జున్, ముషారఫ్, గణేష్, యాదగిరి, లోకేష్, పవన్ కళ్యాణ్ ,శంకర్, సంగీత, నాగరాజు, ప్రశాంత్, రాజ్ కుమార్ అక్షర, తదితరులు పాల్గొన్నారు.
జార్జి రెడ్డి స్ఫూర్తితో యువత ఉద్యమాలకు రావాలి
కాటారం, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): ఉద్యమాలకు నిలువుటద్దమైన జార్జిరెడ్డి వర్ధంతి సభలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కా.జార్జి రెడ్డి (ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ) వర్ధంతిని భారత ఐక్య యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కా. అక్కల బాపు యాదవ్, కా. జార్జిరెడ్డి చిత్రపటానికి పూల దండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో యు వై ఎఫ్ ఐ నాయకులు కా. మంతెన టోనీ, కల్వల సమ్మయ్య, కళ్లెం రమేష్ , రవీందర్ పాల్గో న్నరు. ఈ సందర్భంగా కా.బాపు యాదవ్ మాట్లాడుతూ దేశంలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాలు కోల్పోతున్నారని అన్నారు. మరో వైపు దేశం లో నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.