29-03-2025 07:35:26 PM
కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం..
ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలపై చర్చ..
స్వయం ఉపాధి పథకాల అమలులో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు మెరుగైన వైద్య వైద్య సేవలు..
ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడులను అరికట్టే ఎందుకు ప్రత్యేక చర్యలు..
పారదర్శకంగా విచారణ చేసి బాధితులకు న్యాయం అందించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు..
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు..
సంగారెడ్డి (విజయక్రాంతి): మన పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, బడిబాట కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సహకరించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కోరారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ క్రాంతి వల్లూరు అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు, పాల్గొని జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరును సమీక్షించారు. సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ, వెనుకబడిన తరగతుల, గిరిజన, దళిత వర్గాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం (SC/ST POA Act) అమలు, కేసుల పరిశీలన, కులవృత్తుల అభివృద్ధి, ఆర్థిక సహాయ పథకాల పురోగతి, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల నిర్వహణపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భముగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ... సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ, వెనుకబడిన తరగతుల, గిరిజన, దళిత వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతుల కల్పన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వ పరంగా కల్పిస్తున్న సౌకర్యాలను కలెక్టర్ వివరించారు. ఉపాధి కల్పనలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ అమలు, స్టైఫండ్, ఉపకార వేతనాల పంపిణీ, అమలులో సాంకేతిక సమస్యలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన భూముల రక్షణ, అక్రమ ఆక్రమణలను అరికట్టి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యతపై సమీక్ష, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పిల్లల ఆరోగ్య సంరక్షణ. తనికీలు నిర్వహించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలు, బాధితులకు ప్రభుత్వ పరంగా సహాయం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణ, విచారణలో పారదర్శకత, నిరపాయంగా బాధితులకు న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖేలేష్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ఆర్డీఓలు, డిస్పీలు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.