calender_icon.png 25 October, 2024 | 9:58 AM

వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందిస్తాం

06-08-2024 04:22:48 AM

  1. లిఫ్ట్ ఇరిగేషన్‌ల మంజూరుకు కృషి
  2. మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం
  3. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  4. బక్కమంతులగూడెంలో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన

సూర్యాపేట, ఆగస్టు 5 (విజయక్రాంతి): వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో రూ.2.5 కోట్లతో నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలో స్వచ్ఛదనం  పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనం తరం ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం వెనుకాడదన్నా రు. ఇటీవల అర్హులైన రైతులకు రుణమాఫీ చేశామన్నారు.

మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నా రు. బక్కమంతులగూడెంలో ప్రజల, రైతుల దశాబ్దాల కలను నెరవేర్చేందుకే విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుల్తానాపూర్ తండా వద్ద ఎన్‌సీఎల్, చెన్నాయిపాలెం సబ్‌స్టేషన్ పనులు కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. మఠంపల్లి మండల అభివృద్ధికి రూ.107 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపా రు. అమరవరం, పెదవీడు లిఫ్ట్ ఇరిగేషన్‌లకి మరమ్మతులు చేసి పూర్తిగా అందుబాటులోకి తెచ్చామన్నారు. మరింత ఆయకట్టును పెంచేందుకు రైతుల అవసరాల మేరకు లిఫ్ట్ ఇరిగేషన్‌ల మంజూరుకు కృషి చేస్తానన్నారు.

తెలంగాణ, ఏపీలను కలిపే హుజూర్‌నగర్, మఠంపల్లి రహదారిని విస్తరించేందుకు రూ.80 కోట్లు, చౌటపల్లిమేళ్లచెరువు వరకు రూ.10 కోట్లతో రోడ్డు నిర్మాణ చేస్తామన్నారు. మఠంపల్లి మార్గంలో వర్దాపురం వద్ద, రాఘవాపురం వద్ద రెండు హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.17 కోట్లు, చెన్నాయిపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.11.50 కోట్లు మంజూరైనట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జడ్పీ సీఈవో వీవీ అప్నారావు, హుజూర్‌నగర్ ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.