05-03-2025 12:45:05 AM
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి
పాపన్నపేట, మార్చి 4: నేరాల నియంత్రణలో అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. నేరం జరిగిన చోట ఉన్నవారు నేరం చేసిన వారిని తక్షణమే పట్టుకొని పోలీసులకు సమాచారం ఇస్తే నేరాల నియంత్ర ణను తొందరగా చేయవచ్చన్నారు. జిల్లాలో వివిధ నేరాలలో పాల్గొన్న ఏడుగురు అరెస్టు చేశారు. మంగళవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్లో ఆయన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తో కలిసి నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్డే నాగయ్య రంగంపేట, మక్కని నవీన్ శివ్వంపేట, ఉప్పు సాయి కుమార్ శివ్వంపేట, మక్కని నరేష్ శివ్వంపేట, మక్కని పవన్ శివ్వంపేట, వడ్డే శ్రీకాంత్ శివ్వంపేట, వడ్డే నర్సింలు చిన్నఘనపూర్లు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. వీరిపై ఉమ్మడి జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్ లలో13 కేసులలో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు.
పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం వద్ద భక్తుల మెడలో నుండి బంగారు ఆభరణాల దొంగతనాలలో భాగంగా నమోదైన ఐదు కేసులలో మొత్తం 8 లక్షల విలువైన 121 గ్రాముల బంగారు ఆభరణాలు వారి నుండి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తును వారికి అప్పగిస్తామని తెలిపారు. ఈ నెల 3వ తేదీ రోజు రాత్రి సమయంలో ఏడుపాయలలో పెట్రోలింగ్ చేసే సమయంలో వారిని ప్రశ్నించే క్రమంలో పరారయ్యేందుకు ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
వారిని పట్టుకుని విచారణ చేయగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని చేధించినందుకు గాను పోలీసు అధికారులకు ఈ సందర్బంగా ఎస్పీ రివార్డులను అందజేశారు.
మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్, సీసీఎస్ కానిస్టేబుల్స్ దత్తు, ప్రశాంత్, చిట్టిబాబు, ఐటీ కోర్ కానిస్టేబుల్ విజయ్, ఏఆర్ కానిస్టేబుల్ అనిల్, పాపన్నపేట కానిస్టేబుల్స్ యాదగిరి, దుర్గా ప్రసాద్, వసంత్ రావు, నర్సింలు, నిర్మలలను ఈ సందర్బంగా ఎస్పీ అభినందించి రివార్డులనిఅందజేశారు.