మాజీమంత్రి హరీశ్రావు
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదన్న కారణంతో 163 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ అంశమై బుధవారం ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్రావు.. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రైవేట్ కంపెనీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా డిజిటల్ సర్వే చేయిస్తుంటే తెలంగాణలో మాత్రం ఏఈవోలపై అదనపు భారం మోపుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ, సాగు పెంపుదల లక్ష్యంలో భాగంగా 1,500 కొత్త ఏఈవోల పోస్టులను సృష్టించారని, దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ విజయగాథలో ఏఈవోల పాత్ర ఎంతో ఉందని స్పష్టం చేశారు. అలాంటి వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు. సస్పెండ్ చేసిన 163 ఏఈవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.