- హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కేరళలోని వయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన విషాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం ఆదుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు.
దీనిని కేవలం ఒక రాష్ట్ర సమస్యగా పరిగణించి వదిలేయాలని చూస్తే జాతి క్షమించదని ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. 350 మందికిపైగా దుర్మరణం చెందిన వయనాడ్ విలయాన్ని కేంద్రం మానవీయ దృక్పథంతో చూడాలని సూచించారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించి కొండ చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు.
ఉపగ్రహాల చిత్రాల ద్వారా కచ్చితత్వంతో కూడిన హెచ్చరికలను జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భూకంప ప్రాంతాలను జోన్లుగా విభజించినట్టే, కొండ చరియలు కుప్పకూలే అవకాశాలున్న ప్రదేశాలను కూడా క్యాటగిరీలవారీగా గుర్తించాలని, రుతుపవనాల సమయంలో ఆ ప్రాంతాల్లో సహాయక బృందాలు నిరంతరం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.