* ఫిల్లింగ్ టైమ్ తగ్గించుకునేలా చర్యలు: ఎండీ అశోక్రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): జలమండలి సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ల బుకింగ్ పెరగడంపై జలమండలి అధికారులు దృష్టి సారించారు. శనివారం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఫిల్లింగ్ స్టేషన్ను జలమండలి ఎండీ అశోక్రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ట్యాంకర్ ఫిల్లింగ్, టోకెన్ జనరేషన్ వివరాలను తెలుసుకున్నారు.
అక్కడ ప్రస్తుతం ఉన్న 3 ఫిల్లింగ్ స్టేషన్లకు తోడు మరో 3 ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఒక ట్యాంకర్ను నింపేందుకు 8 నిమిషాల సమయం పడుతుండగా, దాన్ని 5 నిమిషాలకు తగ్గించాలన్నారు. వాటర్ ట్యాంకర్ రాకపోకలకు అంతర్గత రోడ్లను నిర్మించుకోవాలని, ఫిల్లింగ్బే సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గృహవినియోగదారులకు పగటిపూట, హాస్టళ్లు, హోటళ్లు, తదితర వాణిజ్య వినియోగదారులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. దీనివల్ల పెండెన్సీని తగ్గించాలని సూచించారు. డిమాండ్కు అనుగుణంగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జీఎం బ్రిజేశ్, డీజీఎం, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.