calender_icon.png 21 October, 2024 | 1:08 PM

సబ్బుతో ముఖాన్ని కడుగుతున్నారా?

02-07-2024 12:05:00 AM

శరీరంపై ఉండే ధూళి, జిడ్డు అనారోగ్య సమస్యలకు, స్కిన్ ఎలర్జీకి కారణం అవుతాయి. కాబట్టి రోజుకు రెండుసార్లు స్నానం చేయాలని చెబుతారు నిపుణులు. కానీ శరీరానికి ఉపయోగించిన సబ్బును ముఖానికి వాడకూడదు అంటున్నారు. మరి సబ్బుతో ఫేస్ వాష్ చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో చూద్దామా..

ఫేస్ వాష్ అనేది మన రోజువారీ చర్మ సంరక్షణలో ఒక భాగం. ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం నుంచి మురికి, నూనె, మలినాలను తొలగి.. స్కిన్ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే సాధారణంగా అందరూ ముఖం కడుక్కోవడానికి సబ్సును వాడుతుంటారు. కానీ, సబ్బుతో ముఖం కడుక్కోవడం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అవి ఏంటంటే.. సబ్బులో కఠినమైన రసాయనాలు ఉంటాయి.

ఇవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే సబ్బులో ఉండే కాస్టిక్ యాసిడ్ చర్మంలోని సహజ నూనెను పోగొట్టి ముఖం పొడిబారేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా సబ్బును ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొల్లాజెన్ విచ్చిన్నం అవుతుంది. అలాగే డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది ముఖంపై ముడతలు, సన్నని గీతలకు కారణం అవుతుంది. ఇక సబ్బు కారణంగా చర్మం ఉపరితలంపై రంధ్రాలు మూసుకుపోతాయి. దీని కారణంగా ముఖం సహజ సౌందర్యాన్ని కోల్పోతుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.