calender_icon.png 16 April, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'మధురం' చిత్రం మధురమైన విజయాన్ని అందుకోవాలి: వీవీ వినాయక్

16-04-2025 12:32:06 PM

ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ నాయకానాయికలుగా నటించిన తాజాచిత్రం 'మధురం'. రాజేశ్ చికిలే దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఎం బంగార్రాజు నిర్మించారు. ఈ సినిమాకు 'ఎ మెమొరబుల్ లవ్' అనేది ఉపశీర్షిక. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో 'బస్ స్టాప్' ఫేమ్ కోటేశ్వరరావు, కిట్టయ్య, ఎఫ్ఎం బాబాయ్, దివ్యశ్రీ, సమ్యురెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. 

ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఈ మూవీ ట్రైలర్‌‌ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మొదట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు  ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ 'మధురం' చిత్రం మధురమైన విజయం సాధించి.. హీరోగా ఉదయ్ రాజ్‌ కు, దర్శకుడిగా రాజేశ్ కు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

అనంతరం ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె, దర్శకులు విజయ్ కుమార్ కొండా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘‘మధురం’ ట్రైలర్ చాలా బాగుంది. టీనేజ్ లవ్ స్టోరీ చూడగానే నా ఫ్లాష్​బ్యాక్‌ గుర్తొచ్చింది.  2008లో నేను ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా ‘అందమైన మనసులో’. అది పదమూడేళ్ల అమ్మాయి లవ్ స్టోరీ.  ఆ టైమ్‌లో సినిమా చూసినవాళ్లంతా పదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అన్నారు. అలాంటి కాన్సెప్ట్‌తోనే ఇప్పుడు ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రయోగాత్మక ప్రేమకథలు రూపొందించడం కత్తిమీద సాములాంటిది. కానీ ట్రైలర్ చూశాక ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యిందనిపించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేస్తే బంగార్రాజు లాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వస్తారు’’ అన్నారు. 

రఘుకుంచె మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలోని పాటలన్నీ మధురాతి మధురంగా ఉన్నాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. 90స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ స్టోరీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు” అని తెలిపారు. 

డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ.. ‘‘ఈ టైటిల్ ఎంత మధురంగా ఉందో.. సినిమా కూడా అంతే మధురంగా ఉంటుంది. తొంభైల కాలంలోని స్వచ్ఛమైన ప్రేమను ఇందులో చూపిస్తున్నారు. ప్రేక్షకులకు చక్కని అనుభూతిని కలిగిస్తుంది. పాటలన్నీ చాలా వినసొంపుగా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ బాగా నటింంచారు. టీమ్ అందరికీ ఈ చిత్రం మధురమైన హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు. 

హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘మా ట్రైలర్ రిలీజ్ చేసిన వినాయక్ సపోర్ట్ మర్చిపోలేనిది. ఇక ఈ సినిమా పూర్తి చేయడానికి బంగార్రాజు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్‌పుట్ రావాలనుకున్నారు. డైరెక్టర్ రాజేశ్.. నైంటీస్ కథ కావడంతో చాలా కేర్ తీసుకుని రూపొందించారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అద్భుతమైన సంగీతం అందించారు. డీవోపీ మనోహర్ చక్కని విజువల్స్ ఇచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది” అని చెప్పారు. 

చిత్ర దర్శకుడు రాజేశ్ చికిలే మాట్లాడుతూ.. ‘‘ఈ కథను ఎంత బాగా రాసుకున్నానో.. అంతే చక్కని టీమ్ కుదిరింది” అని తెలిపారు.  హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ.. "ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఇందులో నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది.  ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు" అని చెప్పారు.  చిత్ర నిర్మాత బంగార్రాజు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చాలా మధురంగా ఉంటుంది. కొత్త నిర్మాతను అయినా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది” అన్నారు.  ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేంద్ర, నటులు జెమిని సురేశ్, కిట్టయ్య తదితర చిత్రబృందం పాల్గొన్నారు.