11-02-2025 12:36:13 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్ బాచుపల్లి వీఆర్ఎస్ అండ్ వీజే స్కూల్ విద్యార్థి మేఘాంశ్ రిపబ్లిక్ డే క్యాంపులో నేవీ విభాగం (జూనియర్ డివిజన్) లో ఆలిండియా 4వ ర్యాంక్ సాధించినట్లు పాఠశాల ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ రమణశ్రీ హర్షం వ్యక్తం చేశారు.
జనవరి 1 నుంచి 28వ తేదీ వరకు రిపబ్లిక్ డే క్యాంపులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు సోమవారం పాఠశాలలో సోమవారం మేఘాంశ్ను ఘనంగా సత్కరించారు. జూనియర్ డివిజన్లో నేవీ విభాగంలో 4వ ర్యాంకు సాధించడంతో మేఘాంశ్ ప్రధానమంత్రి నివాసాన్ని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసాన్ని సందర్శించడంతో పాటు ప్రధాన మంత్రితో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాంస్కృతిక ప్రతినిధిగా పాల్గొని ఈ ప్రాంత సాంప్రదాయ వైభవాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు.అనంతరం హైదరదాబాద్ వచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన మేఘాంశ్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘనంగా సత్కరించినట్టు వివరించారు.
ఈ సందర్భంగా మేఘాంశ్ను పాఠశాలలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు సత్కరించి, అభినందించారు. మేఘాంశ్ కోచ్ భానుప్రకాశ్ మాట్లాడుతూ.. మేఘాంశ్ కృషిని, నిబద్ధతను ప్రశంసించారు. ఈ గౌరవం కేవలం పాఠశాలకు మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రానికి గర్వకారణం అని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.