జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,(విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణ కొరకు కార్యచరణ ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని, అర్హత గల వారు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎంఎల్సీ ఎన్నికలకు సంబంధించి కార్యచరణ విడుదల చేయడం జరిగిందనీ, అర్హత గల వారు పట్టభద్రుల ఎంఎల్సీ కొరకు ఫారం-18, ఉపాధ్యాయుల ఎంఎల్సీ కొరకు ఫారం-19 ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని, అక్టోబర్ 16వ తేదీన మొదటి రిపబ్లికేషన్, 25వ తేదీన రెండవ రిపబ్లికేషన్ చేయడం జరుగుతుందని, నవంబర్ 6వ తేదీన నమోదు చేసుకునేందుకు ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
నవంబర్ 20వ తేదీన నమోదు అయిన దరఖాస్తులను పరిశీలించి ముసాయిదా జాబితా సిద్ధం చేసి 23న ప్రచురించడం జరుగుతుందని, 23 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని, డిసెంబర్ 25వ తేదీన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిష్కరించి సంబంధిత పత్రాలను పరిశీలించి 30వ తేదీన తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. మెదక్ - నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాలకు జరుగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎం.ఎల్.సి. ఎన్నికలలో అర్హత గల ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. వివరాల కొరకు, దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో, తహశిల్దార్ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.