calender_icon.png 23 October, 2024 | 3:54 AM

డల్లాస్‌లో వీఎన్ ఆదిత్య సినిమా

10-07-2024 12:05:00 AM

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దర్శకుడు వీఎన్ ఆదిత్య. ‘మనసంతా నువ్వే’, ‘శ్రీరామ్’, ‘నేనున్నాను’ వంటి చిత్రాలతో సినీ పరిశ్రమలో తనదైన మార్కు వేశారాయన. ఆయన సినిమా అంటే కచ్చితంగా సందేశాత్మక కథే అని భావిస్తారు ప్రేక్షకులు. తాను దర్శకత్వం వహించిన చిత్రాలు కొన్ని విడుదల సిద్ధంగా ఉండగా, మరో కొత్త సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వీఎన్ ఆదిత్య. ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థతో కలిసి ఆదిత్య సినిమా చేస్తున్నారు. డాక్టర్ మీనాక్షి అనిపిండి దీనికి నిర్మాత. 

తాజాగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం పరిధిలో గల డల్లాస్ నగరంలో ఉన్న లాకింట బంకేట్ హాల్‌లో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిత్య కొత్త సినిమా గురించి వెల్లడించారు. ఈ మూవీ నిర్మాణం డల్లాస్‌లో జరుగనుందని, త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని కూడా చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి ఆడిషన్స్ ఆమెరికాలోనే నిర్వహించామని తెలిపారు. ప్రవాస భారతీయులతోపాటు అమెరికన్స్, స్పానిష్ పీపుల్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, ఏషియన్స్, ఇండియన్స్.. మరీ ముఖ్యంగా తమిళ, కన్నడ, తెలుగు వారు భారీ సంఖ్యలో ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతూ ఆడిషన్స్‌లో పాల్గొనడం సంతాషాన్నిచ్చిందని మేకర్స్ తెలిపారు.