12-04-2025 12:00:00 AM
ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్హాసన్ ప్రస్తుతం సిలికాన్లోని ఏఐ -ఆధారిత రీసెర్చ్ సెంటర్ అయిన పెర్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా సీఈవో అరవింద్ శ్రీనివాస్ను కలిశారు. భారతీయ సినిమా పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, సినీ పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేస్తున్న కమల్ హాసన్ ఇలా భవిష్యత్తును శాసించబోతున్న ఏఐ రీసెర్చ్ సెంటర్ను సందర్శించడం ద్వారా మరిన్ని విప్లవాత్మక మార్పుల్ని తీసుకు రాబోతున్నారు.
ఈ తాజా పర్యనట గురించి పలు విషయాలను కమల్హాసన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘సినిమా నుంచి సిలికాన్ వరకు ప్రతి ఒక్కటీ నిత్యం అభివృద్ది చెందుతూనే ఉంటాయి. ఎంత కనిపెట్టినా, ఏం చేసినా ఇంకా ఏదో చేయాలని, కనిపెట్టాలనే ఆ కూతుహలం, దాహం ఇంకా మనలో ఉంటూనే ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని పెర్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో నాలో ఇంకా కొత్త ఆలోచనలకు ప్రేరణ లభించినట్టు అనిపిస్తుంది.
అరవింద్ శ్రీనివాస్, అతని బృందం కలిసి భవిష్యత్తును నిర్మించడంలో మన భారతీయ చాతుర్యం ప్రకాశిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ భేటీపై అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పర్లెక్సిటీ కార్యాలయంలో కమల్ హాసన్ను కలవడం, ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చిత్రనిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను నేర్చుకోవాలనే మీ ఆలోచనలు, సినిమా పట్ల మీకున్న ప్యాషన్ స్ఫూర్తిదాయకం’ అన్నారు.
పర్ప్లెక్సిటీ అనేది జ్ఞాన-కేంద్రీకత వేదికను సృష్టించడంలో దృష్టి సారించిన ఏఐ స్టార్టప్. ఈ కంపెనీకి జెఫ్ బెజోస్, యాన్ లెకున్ వంటి ప్రముఖ వ్యక్తులు మద్దతు ఇస్తున్నారు. కమల్హాసన్ నేతృత్వంలో ‘థగ్లైఫ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కమల్ హాసన్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణిరత్నం మద్రాస్ టాకీస్, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ నిర్మించారు.
ఇందులో కమల్హాసన్ రంగరాయ శక్తివేల్ నాయగర్గా నటించగా, సిలంబరసన్ టీఆర్, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, జోజు జార్జ్, అభిరామి కీలక పాత్రలు పోషించారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.