26-04-2025 12:00:00 AM
ఉపాధి హామీ పనులపై సంతృప్తి
సదాశివపేట, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలు తీరును సమీక్షించేం దుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామంలో పర్యటించారు. వారి వెంట తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ సృజన, అధికారులు ఉన్నారు. విదేశీ ప్రతినిధుల బృందానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్వాగతం పలికారు. పథకానికి అనుసంధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించరూ బృందం సభ్యులు పథకానికి లబ్ధి పొందుతున్న గ్రామీణ కార్మికులతో మాట్లాడారు.
ఉపాధి అవకాశాలు, వేతన చెల్లింపులు, మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరించారు. పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఫీల్ అసిస్టెంట్లు విదేశీ బృందానికి నీటి సంరక్షణ, పల్లె ప్రగతి కింద చేపడుతున్న పనులపై, సామాజిక తనిఖీపై వివరించారు. విదేశీ ప్రతినిధులు తెలంగాణలో పథకం అమలు పద్ధతులను మెచ్చుకున్నారు. ప్రత్యేకించి, డిజిటల్ మానిటరింగ్ విధానాలు, పారదర్శక చెల్లింపుల వ్యవస్థలు, మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను వారు ప్రశంసించారు. తెలంగాణలో ఉపాధి పథకం గ్రామీణ అభివృద్ధికి ఒక ఆదర్శంగా నిలుస్తోందని వారు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో లేని ఈ ఉపాధి హామీ పథకం భారతదేశంలో మాత్రమే ఉందని వారు ప్రశంసించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వందరోజుల పని కల్పించడo గొప్ప విషయం అన్నారు. అంతకుముందు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అడిషనల్ కమిషనర్ శేషుకుమార్, ఎస్పీఎం మురళి, డిఆర్డిఏ పీడీ జ్యోతి, అదనపు డిఆర్డిఓలు బాలరాజు, జంగారెడ్డి, ఎన్జీవో ప్రతినిధులు వర్షిని, పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.