calender_icon.png 9 October, 2024 | 10:53 PM

నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు

09-10-2024 02:15:52 AM

వారి పేరుపై రిజిస్ట్రేషన్‌కూ అనుమతించం

సారథి వాహన్ పోర్టల్‌లోకి తెలంగాణ

రాష్ట్రంలో కొత్తగా వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, అక్టోబర్ 08 (విజయ క్రాంతి): రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం  మాట్లాడారు. రవాణా శాఖలో రెండు మూడు సంస్కరణలు తీసుకొస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారథి వాహన్ పోర్టల్‌లో చేరుతున్నామని వెల్లడించారు.

కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలు అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసేందుకు జీవో తీసుకొచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లను తీసుకొస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 37 ఏటీఎస్‌లను ప్రారంభించ బోతున్నామని, ఒక్కో సెంటర్‌కు రూ.8 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

దేశవ్యాప్తం గా ఏటా 1.60 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించిన 8 వేల మంది లైసెన్స్‌లు రద్దు అయ్యాయని వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే రద్దు అయిన డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందే అవకాశం ఉండదన్నారు.

కొత్త వాహనాలు కొనుగోలు చేసినా వారి పేరుపైన రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతించబోమని చెప్పారు. దీంతోపాటు ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నిబంధనలు ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలకు వర్తిస్తాయన్నారు. 

విధుల్లోకి 113 మంది ఎంవీఐలు..

కొత్తగా 113 మంది వెహికిల్ ఇన్స్‌పెక్టర్లు విధుల్లోకి రాబోతున్నారని, వారి సేవలను మరింతగా ఉపయోగించుకుంటామని పే ర్కొన్నారు. ఆర్టీసీలో కూడా ఎంవీఐ రూల్స్ అమలవుతున్నాయని, ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహ నాలకు మాత్రమే టీజీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందని స్పష్టం చేశారు.

రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ మోటార్ వెహికిల్ చట్టం ప్రకారమే నిబంధనలన్ని అమలుచేయబోతున్నామని తెలిపారు. వ లంటరీ వెహికిల్ పాలసీ ద్వారా 15 ఏళ్లు దాటిన తర్వాత వలంటీర్‌గా స్క్రాపింగ్ చేసుకున్న వారికి, వచ్చే రెండేళ్లలో కొత్త వాహ నాల కొనుగోలు సమయంలో లైఫ్ ట్యాక్స్ లో మినహాయింపు ఉంటుందని ప్రకటించారు.

15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు స్క్రాప్‌కి పంపించాలని, ప్రభుత్వ వాహనాలకు ఈ నిబంధన తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రభుత్వం 37 ఏటీఎస్‌లను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చిందని, జిల్లాల్లో 33, హైదరాబాద్‌లో నాలుగు అదనంగా ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. వీటి ఏర్పాటు కోసం రూ.296 కోట్లు కేటాయించారని తెలిపారు.

సారథి వాహన్ పోర్టల్‌ను సంవత్సరంలోపు అమలు చేస్తామని చెప్పా రు. ప్రైవేట్ వాహనాలు 15 ఏళ్లు దాటగానే స్క్రాపింగ్ పాలసీలో కచ్చితంగా చేసుకోవాలని నిబంధన లేదని, వాహనదారులు ఇష్టపూర్వకంగానే చేసుకోవచ్చని లేదంటే అదనంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని తెలిపారు.  సమావేంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.