బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: హర్యానా ఎన్నికల్లో రెజ్లింగ్ క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్ విజయం సాధించటంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ ‘ఆమె ఎన్నికల్లో నా పేరును ప్రచారం చేసి గెలిచి ఉంటే నేను చాలా గొప్ప వ్యక్తిని అన్నమాటే.
కనీసం ఆమె గెలుపొందటానికి నా పేరు శక్తిని ఇచ్చింది. ఫొగాట్ ఎక్కడికి వెళ్లినా విధ్వంసం ఆమె వెంటనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. ఆమె వ్యక్తిగతంగా ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు.. కానీ, ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం నాశనమైంది.
ఈ రెజ్లర్లు హీరోలు కాదు.. హర్యానాకు విలన్లు’ అని పేర్కొన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్రిజ్భూషణ రెజ్లర్లపై లైంగికవేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ వినేశ్ ఫొగాట్ సహా రెజ్లింగ్ క్రీడాకారులు ఢిల్లీలో నిరసన తెలిపిన విషయం తెలిసిందే.