వైద్య సిబ్బందికి షోకజ్ నోటీసులు జారీ
విమలనగర్ అర్బన్ పిహెచ్సి ఆకస్మిక తనిఖీ
జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి
హైదరాబాద్,(విజయక్రాంతి): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్ప వని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. సోమవారం బంజారాహిల్స్ విమలనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని హాజరు పట్టిక పరిశీలించి పర్మినెంట్, తాత్కాలిక సిబ్బంది ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఆలస్యంగా రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది
విజయలక్ష్మి సూపర్వైజర్ స్టాప్( పబ్లిక్ హెల్త్ నర్స్), నాగలక్ష్మి, పార్వతి ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేయవలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు.
ఆసుపత్రిలో ఏఏ టెస్టులు చేస్తున్నారని ,ప్రతిరోజు ఎన్ని బ్లడ్ షాంపుల్స్ సేకరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని ఫార్మసీ కేంద్రం సందర్శించి మందులను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగ కార్తీక్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.