బెల్లంపల్లి, విజయక్రాంతి : బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామంలో శానిటేషన్ సరిగా నిర్వహించడం లేదని సోమవారం గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తుందని, గ్రామంలో సానిటేషన్ పనులు కొనసాగడం లేదని, వీధి దీపాలు చెడిపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టడం లేదని, గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కాని, మండల పంచాయతీ అధికారి కూడా గ్రామాన్ని పట్టించుకోవడం లేదనారు. పారిశుద్ధ్యం నిర్వహణ లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, గ్రామంలో ఇప్పటివరకు దోమల మందు స్ప్రే చేయలేదని, గ్రామం లో చెత్త ట్రాక్టర్ తిరగడం లేదని వాపోయారు. అధికారులకు తెలియపరుద్దామంటే ఎవరు అందుబాటులో ఉండడం లేదని, ఫోన్ ద్వారా తెలియపరుద్దామంటే గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామంలో సానిటేషన్ పనులు కొనసాగిస్తూ వీధి దీపాలు బిగించవలసినదిగా కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.