calender_icon.png 27 September, 2024 | 4:55 AM

నిద్రావస్థలో విజిలెన్స్

27-09-2024 03:01:00 AM

అటకెక్కిన కాళేశ్వరంపై విచారణ

రాజీవ్ రతన్ మృతితోనే ఆగిన దర్యాప్తు

కొత్త డీజీ వచ్చినా తీరు మారని విభాగం

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలపై కొద్దిరోజులు వేగంగా విచారణ చేసిన విజిలెన్స్ శాఖ కొద్ది కాలంగా ఎలాంటి కదలిక లేకుండా సుప్తచేతనావస్థలోకి వెళ్లినట్టు కనపడుతోంది. ఆ విభాగానికి డీజీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్త్రన్ హఠాన్మరణంతో విజిలెన్స్ వి భాగం నిస్తేజమయ్యింది. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించటంతో విజిలెన్స్ విభాగం పూర్తిగా సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయింది.  

మొదట్లో వేగంగా..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో అప్పటి విజిలెన్స్ డీజీ రాజీవ్త్రన్ నేతృత్వంలో అధికారుల బృందం ప్రాజెక్టును సందర్శించి, కార్యాలయాలను తనిఖీ చేసి, అధికారులు, ఇంజి నీర్లు, సిబ్బందిని విచారించింది. ఈ సందర్భంగా చాలా కీలకమైన రికార్డులు, ఫైళ్లు, రసీదులను స్వాధీనం చేసుకుంది. విజిలెన్స్ డీజీ రాజీవ్త్రన్ హఠాన్మరణంతో విజిలెన్స్ విభాగం ఒక్కసారిగా స్థంభించిపోయింది. సమర్థుడైన నాయకుడు లేకపోవటంతో విచారణలో వేగం మం దగించింది. ఈ దశలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటుకావటం.. ఒకే అంశంపై రెండు విభాగాలు విచారణ చేయడం చట్టరీ త్యా సరైంది కాదు కనుక.. విజిలెన్స్ విచారణ అటకెక్కింది.  

రాజకీయ ఒత్తిడితో బదిలీలు

హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ డీజీగా ప్రభుత్వం నియమించింది. కొన్ని రాజకీయ పక్షాలు, వర్గాలను సంతృప్తి పరిచేందుకే ఈ అనూహ్య బదిలీలు జరిగాయనే చర్చ పోలీసు వర్గాల్లోనూ కనిపించింది. శ్రీనివాసరెడ్డి రాజకీయ కారణాలతో తనను బదిలీ చేయడపై ఒకింత అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తుంది.