calender_icon.png 10 March, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్కంఠ భరిత పోటీలో ఒక్క పరుగు తేడాతో విజయం

09-03-2025 07:01:08 PM

క్రికెట్ విజేతగా నిలిచిన పోలీస్ జట్టు...

మందమర్రి (విజయక్రాంతి): యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ లో భాగంగా ప్రెస్ అండ్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో ఒక పరుగు తేడాతో పోలీస్ జట్టు విజయం సాధించింది. పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో అధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. తొలుత టాస్ గెలిచి ప్రెస్ క్లబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు నిర్ణీత 14 ఓవర్లలో 111 పరుగులు సాధించగా అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రెస్ క్లబ్ జట్టు 110 సాధించి ఒక్క పరుగు తేడాతో ప్రెస్ క్లబ్ జట్టు పరాజయం పాలయ్యింది.

యువతలో సత్ప్రవర్తనకు క్రీడలు దోహదం... బెల్లంపల్లి ఎసిపి రవికుమార్

మాదకద్రవ్యాల ముప్పు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువతను నేరపు మార్గాల నుంచి మరల్చేందుకు, సత్ప్రవర్తన కలిగిన యువతగా తీర్చిదిద్దేందుకు క్రీడలు దోహదపడతాయని  బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన పెంచేందుకు "యాంటీ డ్రగ్ " పేరిట యువతలో, ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామన్నారు. దీనిలో భాగంగా పట్టణంలో నిర్వహించిన పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

డ్రగ్స్ యువతను జీవితానికి దూరం చేస్తున్నాయని, ఇది ఒక్క వ్యక్తిని కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేసే ముప్పుగా మారిందని దీనిని సమూలంగా నిర్మూలించాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులే కాకుండా, ప్రజలందరూ కలిసి కృషి చేయాలని కోరారు. క్రీడలు యువతను నేరాల నుంచి దూరంగా ఉంచేందుకు మంచి మార్గమని డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలందరు  కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు.

అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్ మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే యువత వ్యసనాల బారిన పడటంతో భవిష్యత్‌ను ప్రమాదంలో పడేస్తోందని ఆన్నారు. మాదకద్రవ్యాల వ్యసనాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులుగా మారి ముందుకు రావాలని కోరారు. అనంతరం విజేతలకు, రన్నరప్ లకు బెల్లంపల్లి ఏసీపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విన్నర్ ట్రోఫీని పట్టణ సీఐ శశిధర్ రెడ్డికి, రన్నర్ ట్రోఫీని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్‌ కు అందజేశారు. అదేవిధంగా, మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పట్టణ ఎస్సై రాజశేఖర్‌కు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు పాత్రికేయులు పాల్గొన్నారు.