18-02-2025 12:36:21 AM
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తనకు పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తించ లేదని నిరసిస్తూ ఓ రైతు బ్యాంకు ముందే తన బైకు ను తగలబెట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలకపల్లి మండలం గోలగుండం గ్రామానికి చెందిన నిరంజనమ్మకు 2:20 గుంటల భూమి ఉన్నది.
కాగా మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాను తీసుకున్న రుణంలో ప్రభుత్వం ఇచ్చిన 95వేలు మాఫీ కాగా మరో 10వేల 124 వడ్డీ డబ్బులు బకాయి ఉన్నది. మళ్లీ లోన్ ఇచ్చేందుకు ఎన్ పిఏ అకౌంట్ పరిధిలోకి వెళ్లడంతో మళ్లీ రుణం ఇచ్చేందుకు అవకాశం లేదని బ్యాంక్ సిబ్బంది చెప్పారు.
తన పాస్ బుక్ తనకు ఇవ్వాలని నిరంజన్ అమ్మ కుమారుడు చందు కోరడంతో వడ్డీ బకాయి చెల్లించాల్సి ఉందని చెప్పారు. దీంతో విసిగిపోయిన కుమారుడు చందు సోమవారం బ్యాంకు ముందు తాను వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టి తగలబెట్టాడు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అర్పారు.
ఈనెల 12న ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా నిధులు 15వేలు కూడా తన అకౌంట్లో జమ అయినట్లుగా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ మేనేజర్ దిలీప్ తెలిపారు. ఈ సమాచారాన్ని తెలుసుకోకుండానే క్షణికావేశంలో బైక్ తగలబెట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంపై బాధితు డు మాత్రం తనకి ఇవ్వాల్సిన పాసుబుక్ ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపించారు.