calender_icon.png 12 October, 2024 | 9:01 PM

వరద నీటిలో పాలమూరు పంపులు..!

03-09-2024 11:17:16 AM

భారీగా ఆస్తి నష్టం

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూడో లిఫ్ట్ వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్ పంపు మోటర్లు వరద నీటిలో మునిగిపోయాయి. గత నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు, వాగులు ఉప్పొంగడంతో నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామ సమీపంలోని సొరంగ మార్గం ద్వారా వరద నీరు అండర్ గ్రౌండ్ టర్నల్ లోపలికి ప్రవేశించాయి. అప్పటికే పనులు ముగించుకున్న సిబ్బంది అందరూ బయటనే ఉండడంతో ప్రాణ నష్టం తప్పినట్లు అంచనా వేస్తున్నారు. కానీ భారీ వాహనాలు హిటాచీలు వంటివి అండర్ గ్రౌండ్ లోనే మిగిలిపోయాయి.

ఆదివారం సాయంత్రం వరద నీరు శ్రీపురం అండర్ గ్రౌండ్ టర్నల్ మీదుగా ఉయ్యాలవాడ టర్నల్ నుంచి మూడో లిఫ్ట్ వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్ లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో మోటర్లన్నీ వరద నీటిలోనే చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఎంత మేర నష్టం జరిగిందన్న అంశాలపై అధికారులు అంచనా వేస్తున్నారు. వరద నీటిని పూర్తిగా బయటికి పంపితేనే మోటార్ల పరిస్థితి ఏంటని స్పష్టత వస్తుందంటున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే వరద నీరు స్వరంగ మార్గం ద్వారా వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.