వరుణ్ సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘విరాజి’. ఈ చిత్రంతో ఆద్యాంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతుండగా, మహా మూవీస్తో కలిసి ఎం3 మీడియా బ్యానర్పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మేకర్స్ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘విరాజి’ మంచి టైటిల్. వరుణ్ సందేశ్ను కొత్త అవతార్లో చూపించే చిత్రమిది అని అన్నారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. “విరాజి’ కథ వింటున్నప్పుడే రెండు మూడు చోట్ల గెస్ చేశాను. సెకండాఫ్కు వచ్చేసరికి గూస్బంప్స్ వచ్చాయి. అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా. డైరెక్టర్ హర్షకు ఇది మొదటి సినిమా కానీ, ఈ సినిమా ద్వారా మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలను కచ్చితంగా అందుకుంటారు. నా 17 ఏళ్ల కెరీర్లో చేయని డిఫరెంట్ మూవీ ఇది. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. ఈ నెల 10న ఫస్ట్లుక్ రిలీజ్ చేస్తాం.. అప్పుడు అందరూ సర్ప్రైజ్ అవుతారు” అన్నారు. రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరాం, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఎబినేజర్ పాల్ స్వరకర్త.