calender_icon.png 20 April, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనజీవి రామయ్య జీవితం స్ఫూర్తిదాయకం

14-04-2025 12:53:50 AM

వనజీవి (దరిపల్లి) రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 

ఖమ్మం, ఏప్రిల్ 13 ( విజయక్రాంతి ):-వనజీవి రామయ్య జీవితం స్ఫూర్తిదాయ కమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి, ఖమ్మం ఎంపీ రామసహా యం రఘురాం రెడ్డి తో కలిసి ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగూడెం లో దివంగత పద్మశ్రీ వనజీవి(దరిపల్లి) రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ స భ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వనజీవి రామయ్య మృతి చాలా దురదృష్టకరం, బాధాకరమని అన్నారు.

పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మనకు కలిపించనంతగా దూరమయ్యారని, వారు చేసిన పనులు కలకాలం గుర్తుండిపోతాయని అన్నారు. ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన, స్థానిక శాసన సభ్యునిగా తన పక్షాన వనజీవి రామయ్య ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మనిషి జీవించినంత కాలం చేసిన మంచి పను లే వారిని చిరస్మరణీయులని చేస్తాయని మంత్రి తెలిపారు. వనజీవి రామయ్య చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశ ప్రజలు గౌరవించే విధంగా చేశాయన్నారు.

వనజీవి రామయ్య చెట్లను పెంచే కార్యక్రమాన్ని జీవిత కాలమంతా చేశారని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న, వాటన్నిటినీ అధిగమించి, కోటి మొక్కలకు పైగా నాటారని అన్నారు. వేలాది కోట్ల విత్తనాలను, వందలాది ఎకరాల్లో జీవం పోశార న్నారు.

పచ్చదనాన్ని పెంచడానికి, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయిన, ఒక పూట తిన్నా, తినకపోయిన  మొక్కలు పెంచాలని, మొక్కలతో వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ, వారి గ్రామంలోనే కా కుండా చుట్టుపక్కల అటవీ భూములు, ప్రభుత్వ భూములు, ఎక్కడైతే మొక్కను నాటోచ్చో, ఆ ప్రాంతాల్లో మొక్కలు నాటి, ప్రాంతాన్ని అద్భుతంగా పచ్చదనం చేశారని, పద్మశ్రీ అవార్డు అందుకున్నారని మంత్రి తెలిపారు. వనజీవి రామయ్యకు చిరకాల కోరికలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారని, వాటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి, వాటన్నిటిని నెరవేర్చడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. 

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, రూరల్ తహసిల్దార్  రాం ప్రసాద్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.