22-02-2025 12:30:37 AM
టేకులపల్లి, ఫిబ్రవరి 21 : అకాల వర్షం రైతుని తీవ్ర నష్టానికి గురి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా గాలి దుమారంతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగి ఏపుగా తయారైన కంకులు పనికి రాకుండా తయారయ్యాయి. ఇప్పటికే మిర్చి రైతులు పంటను ఏరి కళ్ళల్లో ఆరబోసి ఉంచారు.
అకాలంగా వచ్చిన వర్షంతో మిర్చి మొత్తం తడిసి ముద్దయింది.పగలంతా ఎండగా ఉంది, సాయంత్రం ఆకస్మికంగా మబ్బులు కమ్మి కుండపోతగా వర్షం కురియడంతో కళ్ళల్లో ఉన్న మిర్చి పంటను కుప్పగా పోసి రక్షించుకునే పరిస్థితి లేకుండా పోయింది. తడిసి ముద్దవ్వడంతో అవి ఎండిన నల్లబారి ధర పలికే పరిస్థితి ఉండదంటూ రైతులు లబోదిబోమంటున్నారు. మండల వ్యాప్తంగా వర్షం గంట పాటు కురిసింది. ఎండల తాపానికి కొంత ఉపశమనం ఇచ్చినా, రైతులకు మాత్రం వర్షంతో తీరని నష్టం కలిగింది.