17-04-2025 12:18:02 AM
అన్నదాతలు అతలాకుతలం
పెద్దపల్లి, మంథని ఏప్రిల్ 16(విజయ క్రాంతి): జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇన్నాళ్లు పంటలెండిపోకుండా కాపాడుకోవడానికి అపసోపాలు పడ్డ రైతులకు చివరకు పంట చేతికొచ్చి కోసుకుందామనుకున్న సమయానికి అకాల వర్షాలు తీవ్ర నష్టాలు గురిచేస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాలలో వడగళ్లు, ఈదురుగాలులతో వరి, మామిడి పంటలు తీవ్ర స్థాయిలో నష్టపోగా, మంగళవారం జిల్లాలోని పలు మండలాలలో వర్షంతో పాటు వడగళ్ల వర్షం కురవడం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇక్కడ 2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ తదితర మండలాలలో మంథని పట్టణంలో సాయంత్రం, రాత్రి ఒక్కసారిగా ఈదురు గాలులు, ముసురు వర్షంతో మార్కెట్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా తాడ్పాలుతో కప్పారు. అయినప్పటికీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందానికి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముత్తారం మండల కేంద్రంలో గాలి ప్రభావంతో సర్వీస్ రోడ్డుపై చెట్లు కూలిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మండల కేంద్రంలో ఈదురు గాలులకు చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. 11 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. చేతికొచ్చిన పంట తడిసిపోయింది. గ్రామాల్లో కురిసిన వర్షానికి మామిడి రైతులతో పాటు కోతకు వచ్చిన వరి పంట దెబ్బతిన్నాయి. ముత్తారంలో కేతిరి మహేష్, గుడి సంతోష్ ఇంటి పై కప్పులు కొట్టుకుపోయాయి. దీంతో వారికి తీవ్ర నష్టం జరిగిందని రైతులు తెలిపారు. నష్టపోయిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు.