9 నెలల మీ పాలనలో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ?
జవాబివ్వకుంటే ప్రజలు కాంగ్రెస్ను క్షమించబోరు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. ఇచ్చిన హామీలతోపాటు ప్రజాసంక్షేమం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు స్పష్టంచేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల కోసం రూ.3 లక్షల కోట్లు, కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ముద్రా రుణపరిమితిని పెంచినట్టు గుర్తుచేశారు. రూ.5.36 లక్షల కోట్లతో 3 కోట్ల ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ ఛార్జీలను తగ్గించినట్టు వెల్లడించారు. ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలైందని, 6 గ్యారంటీలను కూడా ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. 9 నెలల వారి పాలనలో నెర వేర్చిన హామీలపై సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ప్రజలు కాంగ్రెస్ను క్షమించబోరన్నారు.