01-04-2025 10:51:27 PM
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను సంరక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం రాష్ట ప్రభుత్వ దిస్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైపోయింది, విచ్చలవిడిగా భూములను ఆక్రమించుకుంటున్నారు, చివరికి విద్యాసంస్థల భూములను కూడా వదలడం లేదనీ వాపోయారు.
ఉత్తర భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ లలో ఎచ్ సీ యూ ఒకటి అలాంటి యూనివర్సిటీ భూములను గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వేలం వేసి అమ్మే ఆలోచనలో ఉందని యూనివర్సిటీ విద్యార్థులు ఆ భూములను కాపాడుకోవాలని అక్కడ ఉన్న ప్రకృతిని రక్షించుకోవాలని పక్షులు, జంతువులుకు రక్షణ కల్పించాలని ఉద్దేశంతో సామరస్యంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తే ప్రభుత్వం పోలీస్ బలగాలతో విద్యార్థులను చాలా కిరాతకంగా ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాలలో ఎక్కించుకొని అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టిందన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, కార్తీక్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.