హైదరాబాద్: హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. చర్లపల్లిలో కిషన్రెడ్డి ఆదివారం పర్యటించారు. చర్లపల్లి టర్మినల్ పనులను కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎంతో కలిసి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ను నిర్మించింది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించనున్నారు. చర్లపల్లి టెర్మినల్ ను 9 ప్లాట్ ఫామ్ లు, 9 లిఫ్టులు, 5 ఎస్కలెటర్లు,2 విశాల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో కేంద్రం నిర్మిస్తోంది.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి నడిచే వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్లు ప్రవేశపెడతామన్నారు. చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్ కనెక్టవిటీ పెంచాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. తెలంగాణకు మూడు మేజర్ టర్మినల్స్ ఉన్నాయన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నెలరోజుల్లో చర్లపల్లి రైల్వే టర్మినల్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గూడ్స్ రైళ్లు కూడా ఇక్కడే అన్లోడ్ చేసుకోవచ్చని కిషన్ రెడ్డి వెల్లడించారు.