12-04-2025 11:50:59 PM
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం మధ్యప్రదేశ్లోని ఖానియాదాలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అక్కడకు వచ్చిన ఒక మహిళ యథేచ్చగా గుట్కా తినడం మంత్రి కంటపడింది. గుట్కా ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిసిన మంత్రి ఆమె వద్దకు వెళ్లారు. ‘అమ్మా! మీరు గుట్కా తినడం చూశాను. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. అలవాటును మానుకో’ అని మహిళపై కోపం ప్రదర్శించకుండా తనదైన శైలిలో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆమె బ్యాగులోని గుట్కా ప్యాకెట్ను కూడా బయటకు తీయించి తన సిబ్బందికి ఇచ్చి బయటపారేయించాడు. ఆ తర్వాత అక్కడి గంభీర వాతావరణాన్ని మార్చేందుకు సరదా వ్యాఖ్యలు చేశారు. ‘నీ సుపారీ తీసేసుకున్నందుకు బాధపడకు. నీ ఆరోగ్యానికి మేలు జరిగినందుకు సంతోషించు’ అని జ్యోతిరాదిత్య పేర్కొనడంతో అక్కడున్న వారంతా నవ్వారు. సామాజిక మాధ్యమంలో కేంద్ర మంత్రి చర్యను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.