13-12-2024 12:35:18 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): మహిళా సమాఖ్య సభ్యుల కు మొదటిసారిగా యూనిఫాం చీరలు అందించనున్నారు. ఈ మేరకు చీరల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు యూనిఫాం చీరలు ఉచితంగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇందుకోసం ఇందిరా మహిళా శక్తి లోగో, రంగులతో ఆకర్షణీయంగా ప్రత్యేకంగా డిజైన్లను రూపొందిస్తున్నట్టు సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ పేర్కొన్నారు. ప్రత్యేక చీరల డిజైన్లను గురువారం సచివాలయంలో మంత్రి సీతక్కకు చూపించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ త్వరలోనే వీటి రంగులు, డిజైన్లను ఫైనల్ చేయనున్న ట్టు తెలిపారు. అంగన్వాడీ, ఆయాలకు ఇచ్చే యూనిఫాం చీరల డిజైన్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ పాల్గొన్నారు.
అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తాం
అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గురువారం అంగన్వాడీ ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. హామీ ఇచ్చిన విధంగా పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని, అప్గ్రేడ్ అయిన మినీ అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి జీతాలను పెంచి సకాలంలో చెల్లించాలంటూ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన మంత్రి సీతక్క అంగన్వాడీల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని స్పష్టంచేశారు. దీంతో మంత్రికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, నేతలు కృతజ్ఞతలు తెలిపారు.